ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైబీపీతో బాధపడుతున్నారని ఆమెన్ న్యాయవాదులు పేర్కొన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో కవిత ఆరోగ్యంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు ద్వారా ఈడీని కోరారు. దీనిపై కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వివరించారు. ఎమ్మెల్సీ కవిత కస్టడీ గడువు ముగియడంతో ఈడీ ఆమెను మరికాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనుంది.

కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాలంటూ ఈడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉందని సమాచారం. అయితే, కస్టడీ కొనసాగింపును కవిత తరఫు లాయర్లు అడ్డుకోనున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆమె హైబీపీతో బాధపడుతున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. కస్టడీ కొనసాగింపునకు ఈడీ దాఖలు చేయనున్న పిటిషన్ ను కవిత లాయర్లు ఛాలెంజ్ చేయనున్నారని సమాచారం.