ఏపీలో ముందస్తు ఎన్నికల సందడి కనిపిస్తోంది. జూన్ 7న ఏపీ సీఎం వైఎస్ జగన్ కేబినెట్ భేటీ ఏర్పాటు అయ్యే అవకాశం వుండటంతో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక సంకేతాలు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ లో అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణతో పాటే జగన్ కూడా నవంవర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలకు వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యెన్నికల ప్రచారం లో టి‌డి‌పి ఒక అడుగు ముందే వుందని చెప్పాలి. చంద్రబాబు అలర్ట్ అయి మహానాడులో మినీ మ్యానిఫెస్టో కూడా ప్రకటించారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అలర్ట్ అయ్యి వారాహి యాత్ర కూడా ప్రారంబిస్తున్నారని తెలుస్తోంది. జనసేనాని  ఎన్నికల ప్రచారం కోసం వారాహి పేరుతో ప్రత్యేకంగా వాహనాన్ని తయారు చేయించి పెట్టుకున్నారు. ఈ వాహనం విషయంలో వైసీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా వాటిని అధిగమించి విజయవాడలో పూజలు కూడా చేయించిన విషయం మీ అందరికీ తెలిసినదే. ఈ మధ్యే మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభకు సైతం అందులోనే బయలుదేరారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వారాహిలో యాత్ర చేసేందుకు పవన్ సిద్ధమవుతున్నారు.

పవన్ చేపట్టబోయే వారాహి యాత్రపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ చర్చలు ప్రారంభించారు. వారాహి యాత్ర రూట్ మ్యాప్, ఇతర అంశాలపై నేతలతో ఇప్పటికే పలుమార్లు చర్చించారు. ఇవాళ మంగళగిరిలో గోదావరి జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. వారాహి యాత్ర గోదావరి జిల్లాల నుంచే ప్రారంభమవుతున్న నేపథ్యంలో గోదావరి జిల్లాల నేతలతో నాదెండ్ల నిర్వహించిన సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.