ప్రచారంలో భాగంగా నిడదవోలులో నిర్వహించిన ప్రజాగళం సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఎదిరించే వాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమని అయన అన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అధికారం, పెత్తనం అంతా ఐదుగురి చేతిలో చేతుల్లోనే ఉందని ధ్వజమెత్తారు.ఆ ఐదు మంది ఐదు కోట్ల మంది ప్రజలను అణచివేస్తున్నారని , అందుకే అందరూ కలిసి కట్టుగా రావాలని పిలుపునిచ్చారు. తాము పొత్తు పెట్టుకోవడానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్ద్యేశం తోనేనని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ఏదైనా నిలదీస్తే నాపై, చంద్రబాబుపై, పురందేశ్వరిపై బూతులు తిడతారు అని మండిపడ్డారు. ఏ ఒక్కరినీ వదిలేది లేదని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని హెచ్చరించారు. ఢిల్లీలో మోదీ నాయకత్వం, ఏపీలో చంద్రబాబు అనుభవం, ఐదేళ్లుగా వైసీపీ దాడులను తట్టుకుని నిలబడిన జనసైనికులు, వీరమహిళలను కలుపుకుని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చామని వివరించారు. రౌడీ రాజ్యం పోవాలని , రామరాజ్యం రావాలని , ధర్మం నిలబడాలన్న అజెండాతోనే తాము ముందుకు వెళ్తున్నాం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలి, పరిశ్రమలు ఏర్పాటై అభివృద్ధి దిశగా రాష్ట్రం పయనించాలి అని పెద్ద మనసుతో ఆలోచించి సీట్ల సర్దుబాటు విషయంలో బాగా తగ్గామని, ముఖ్యంగా, సంస్థాగతంగా బలంగా ఉన్న చంద్రబాబు కూడా టీడీపీ విషయంలో బాగా తగ్గారని పవన్ వివరించారు. నిడదవోలు నుంచి జనసేన పార్టీ తరపున కందుల దుర్గేశ్ పోటీ చేస్తున్నారని పవన్ తెలిపారు. నిడదవోలు నియోజకవర్గ అభవృద్ధికి జనసేన వద్ద ప్రణాళికలు ఉన్నాయని అన్నారు. “వివేకా హత్య కేసు నిందితులను వెనకేసుకుని వస్తున్నాడు. సొంత చెల్లెళ్లకే గౌరవం ఇవ్వని జగన్ కి ఇంకా సగటు ఆడపిల్లలు లెక్కే కాదని , 3 వేల మంది ఆడబిడ్డలు ఆచూకీ లేకుండా పోతే, ఈ సీఎం పట్టించుకోనేలేదన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్లమెంటు ఉభయ సభల్లో 30కి పైగా సభ్యులు ఉండి కూడా రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో కానీ, అసెంబ్లీలో కానీ చర్చ జరపలేదు” అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.