మంత్రి సీతక్క మరోమారు బి ఆర్ ఎస్ పై మన్సిపడ్డారు. తమ పార్టీలో చేరుతున్న బి ఆర్ ఎస్ నేతలను విమర్చించే హక్కు వారికీ లేదన్నారు. నాడు అభివృద్ధి కోసం బీఆర్ఎస్‌లోకి వెళ్లినవారు… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదే అభివృద్ధి కోసం మావైపు వస్తారా? అని తాను ఆ రోజే అడిగానని మంత్రి సీతక్క ప్రశ్నించారు. వారు అభివృద్ధి కోసం అప్పుడు ఆ పార్టీలో చేరితే… ఇప్పుడు అందుకోసమే తమ వైపు వస్తున్నారన్నారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకొని దానికి అభివృద్ధి కోసం అని పేరు పెట్టిందే బీఆర్ఎస్ అని విమర్శించారు.ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై విమర్శలు చేసే నైతిక హక్కు బీఆర్ఎస్ వారికి లేదన్నారు. పినపాక మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దారన్నారు. అతనిని రెండుసార్లు గెలిపించిన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారన్నారు. ఆనాడు అభివృద్ధి కోసం బీఆర్ఎస్‌లోకి వెళ్ళినట్లైతే ఈ రోజు కూడా అదే అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. వారు చేస్తే నీతి… ఇతరులు చేస్తే రోత అవుతుందా? అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ కట్టించిన కార్యాలయానికి బీఆర్ఎస్ కార్యాలయం అని పేరు పెట్టుకున్నారని… అందుకు సిగ్గుండాలని బలరాం నాయక్ మండిపడ్డారు. ఆయన కాంగ్రెస్ ఇంట్లో ఉంటూ బీఆర్ఎస్ బోర్డు పెట్టుకోవడం విడ్డూరమన్నారు. అది ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమేనని తెలుసుకోవాలన్నారు. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకొని మాట్లాడాలన్నారు.