ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ‘ప్రాజెక్టు K’ సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా, ఇంతవరకూ 80 శాతానికి పైగా చిత్రీకరణను జరుపుకుందని అంటున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా కాదు .. పాన్ వరల్డ్ సినిమా అని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పిన దగ్గర నుంచి అందరిలో అంచనాలు పెరుగుతూ వెళుతున్నాయి. ఇది ప్రభాస్ చేస్తున్న ఫస్టు ‘సైన్స్ ఫిక్షన్’ మూవీ. ఇందులో ప్రభాస్ జోడీగా దీపిక పదుకొణె నటిస్తోంది. సైంటిస్ట్ గా అమితాబ్ కనిపించనుండగా .. ప్రతినాయకుడి పాత్రను కమల్ పోషిస్తున్నారు. ఇక ఇతర ముఖ్యమైన పాత్రలలో వివిధ భాషలకి చెందిన నటీనటులు కనిపించనున్నారు. సాంకేతిక పరంగా కూడా ఈ సినిమా అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. ఆల్రెడీ దీపిక ఫస్టులుక్ ను వదిలిన టీమ్, కొంత సేపటి క్రితం ప్రభాస్ ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ‘అవెంజర్స్’ తరహాలో ఒక డిఫరెంట్ లుక్ తో ప్రభాస్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. ఆయన కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకమైన స్థానంలో నిలబడుతుందని నాగ్ అశ్విన్ చెప్పిన మాట ఎంతవరకూ నిజమవుతుందనేది చూడాలి. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందనే ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.