భారత పౌరులు అందరికీ ఒకే గుర్తింపు ‘ఆధార్ కార్డు’ తరహాలో దేశంలోని విద్యార్థులు అందరికీ ఒకే ఐడీ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (ఆపార్ కార్డ్) ను మొదలుపెట్టింది. జాతీయ విద్యావిధానం 2020లో భాగంగా విద్యార్థులకు ఈ కొత్త ఐడీని జారీ చేస్తోంది. వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడీ కార్డుగా దీనిని వ్యవహరిస్తారు. దీంతో విద్యార్థులకు సంబంధించిన అన్ని వివరాలు అంటే.. డిగ్రీలు, రివార్డులు, స్కాలర్ షిప్ లు, క్రెడిట్ లు సహా పూర్తి అకడమిక్ డేటాను డిజిటలైజేషన్ చేయనున్నారు. విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఈ వ్యవస్థను ఎడ్యు లాకర్ గా సూచిస్తున్నారు.

విద్యార్థులకు ప్రయోజనం..
ఆపార్ కార్డు.. దేశంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అందించబోయే డిజిటల్ ఐడీ. అకడమిక్ వివరాలన్నీ డిజిటలైజేషన్ చేయడం వల్ల ఆన్ లైన్ లో తమ వివరాలను అవసరమైనపుడు చూసుకోవడం, డౌన్ లోడ్ చేసుకోవడం సాధ్యపడుతుంది. విద్యార్థులకు సంబంధించిన ట్రాక్ రికార్డును నమోదు చేయవచ్చు. దీంతో ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు బదిలీ సులభం కానుంది. ప్రీ ప్రైమరీ నుంచి పీజీ చదువుతున్న విద్యార్థుల దాకా.. అన్ని పాఠశాలలు, కళాశాలలు ఈ కార్డును జారీ చేస్తాయి.