టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. సోమవారం ఆయన రాజీనామా చేయగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ని జనార్దన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం కలిశారు. బోర్డుకు సంబంధించి వివిధ అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. మరో రెండు రోజుల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీఎస్‌పీఎస్సీ నియామకాలకు సంబంధించి సమీక్ష జరగనుంది.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన నియామకాల ప్రక్రియకు సంబంధించి పూర్తి ఫైళ్లతో రావాలని జనార్దన్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ఇంతలోనే ఆయన తన పదవి నుంచి తప్పుకుంటూ రాజీనామా పత్రాన్ని సమర్పించారు. జనార్దన్ రెడ్డి 2021లో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమితులయ్యారు. కేసీఆర్ హయాంలో… టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షలలో పేపర్ లీక్, పరీక్షల వాయిదాలతో విద్యార్థులు ఆందోళనకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం… టీఎస్‌పీఎస్సీ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించింది.