తెలంగాణ రాష్ట్రంలో ఇక నుండి డ్రగ్స్ అనే మాట వినపడకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఐదు కీలక శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, నార్కోటిక్ అండ్ డ్రగ్స్, ఎక్సైజ్, టీఎస్‌పీఎస్సీ, సింగరేణిలపై సమీక్ష నిర్వహించారు. నార్కోటిక్ అండ్ డ్రగ్స్‌పై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… మన రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడవద్దన్నారు. ఇక నుంచి ప్రతి నెల నార్కోటిక్ బ్యూరోపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. టీఎస్‌పీఎస్సీపై మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

రేవంత్ రెడ్డిని కలిసిన ఆమ్రపాలి

ఐఏఎస్ ఆమ్రపాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల కేంద్ర సర్వీసులో ఆమ్రపాలి డిప్యుటేషన్ పూర్తి కావడంతో రాష్ట్ర సర్వీసులో చేరనున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని కలిశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె రిపోర్ట్ చేశారు.