హైదరాబాదు యశోదా ఆసుపత్రిలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

“కె.చంద్రశేఖర్ రావు గారికి హిప్ ఆపరేషన్ జరగడంతో వారిని పరామర్శించడానికి వచ్చాను. ఆయనతో మాట్లాడాను. కేసీఆర్ కు చికిత్స అందిస్తున్న డాక్టర్లతో కూడా మాట్లాడితే, ఆయన కోలుకుని మామూలుగా నడవడానికి 6 వారాలు పడుతుందని చెప్పారు. కేసీఆర్ కు ఫిజియోథెరపీ అవసరమని కూడా చెప్పారు. 

కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లు చెప్పిన వివరాలు తెలుసుకున్న తర్వాత సంతృప్తికరంగా ఉంది. కేసీఆర్ త్వరగా కోలుకుని, మళ్లీ ప్రజాసేవ కోసం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. 

ఒక్కోసారి జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. ఆయన జారి కిందపడడంతో హిప్ జాయింట్ కు ఫ్రాక్చర్ అయింది. డాక్టర్లు చేసిన శస్త్రచికిత్స కూడా సఫలమైంది. వైద్యులు చెప్పిన వివరాలను బట్టి కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారు. ఆయన ఎలాంటి ఇబ్బందులు లేకుండా మామూలుగా తిరుగుతారు. మెట్లెక్కడం, ఇతర పనులు మామూలుగానే చేసుకోవచ్చు.