రామోజీరావు అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. రామోజీ నివాసం నుంచి సాగిన యాత్రలో పాల్గొని పాడె మోశారు. స్మృతివనం వద్ద రామోజీకి కడసారి వీడ్కోలు పలికారు. పూలతో రామోజీ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కాగా, రామోజీ అంతిమయాత్ర స్మారక కట్టడం వరకు చేరుకుంది.

మరికాసేపట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తికానున్నాయి. స్మారక కట్టడం వద్దకు రామోజీ అభిమానులు, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది భారీగా చేరుకున్నారు. తెలంగాణ మంత్రి తుమ్మల, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావులతో పాటు సినీ ప్రముఖులు బోయపాటి శ్రీను, సురేశ్‌ బాబు తదితరులు రామోజీ అంత్యక్రియలకు హాజరయ్యారు.