కేసీఆర్, కేటీఆర్, కవితలు తన ప్రభుత్వాన్ని కూలగొడతామని అంటున్నారు… అంత పాపం నేనేం చేశాను? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. వారి అవినీతి సొమ్ములో షేర్ అడిగానా? ప్రభుత్వాన్ని పడగొడతానని ఎందుకు అంటున్నారని నిలదీశారు. మంగళవారం ‘మహిళా శక్తి’ సభలో ఆయన మాట్లాడుతూ… సోనియా గాంధీపై నమ్మకంతో, కాంగ్రెస్ మీద భరోసాతో ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పే నేతలను మహిళలు అందరూ చీపుర్లతో తిరగేసి కొట్టి పంపించాలన్నారు. 

మోదీ, కేసీఆర్ కలిసి గ్యాస్ ధరలు పెంచి ఆడబిడ్డల సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పును నా నెత్తిన పెట్టి వెళ్లారని విమర్శించారు. సంసారాన్ని చక్కదిద్దుకుంటూ… ఒక్కొక్క చిక్కుముడి విప్పుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని పదేళ్ల పాటు ఆశ చూపి కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.