ఇతర పార్టీలు ఇచ్చే హామీలు ఎన్నికల వరకు గ్యారెంటీలు మాత్రమేనని… కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేది కేవలం నరేంద్ర మోదీ మాత్రమేనని బీజేపీ నేత మురళీధరరావు అన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టామన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జులైలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతామని తెలిపారు. ఈ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతను ఇచ్చిందన్నారు. ఈ రెండింటికీ సమ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.

నిర్మలా సీతారామన్ యువకుల అవసరాలు, భవిష్యత్తుకు పెద్ద పీట వేశారని పేర్కొన్నారు. ముద్ర యోజనలో 70 శాతం లబ్ధిదారులు మహిళలే అని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి అండగా నిలబడినట్లు తెలిపారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే ప్రధాని నరేంద్ర మోదీ వల్లే సాధ్యమన్నారు. ఇతర పార్టీలు ఇచ్చే హామీలు కేవలం ఎన్నికల వరకు మాత్రమే ఉంటాయన్నారు.