ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ ధర్నా చేయించడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. హైదరాబాద్ బోలక్‌పూర్‌లో బుధవారం ఆయన పర్యటించారు. ప్రజాపాలన – అభయహస్తం దరఖాస్తుల కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ… తాము అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని వెల్లడించారు.

అలాగే అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. బీఆర్ఎస్ ఆటో డ్రైవర్లతో ఎందుకు ధర్నా చేయిస్తోంది? అని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయవద్దని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారా? అని నిలదీశారు. ప్రజాపాలనకు వచ్చే స్పందన చూసి బీఆర్ఎస్ నాయకులకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు.