టీడీపీ అధినేత చంద్రబాబును ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిశారు. చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పయ్యావుల జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు.

ప్రత్యర్థులు ఆయనను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీయాలనుకున్నారని, కానీ ఆయన జైల్లో మానసికంగా మరింత దృఢంగా తయారయ్యారని వెల్లడించారు. ఇవాళ ములాఖత్ లో ఆయన తనతో మాట్లాడిన ప్రతి మాట రాష్ట్రం కోసమేని తెలిపారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనేది చంద్రబాబు మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారని పయ్యావుల పేర్కొన్నారు. పార్టీకి కూడా ఆయన ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారని వివరించారు. 

“ప్రజా సమస్యలపై పోరాట పంథాను వీడొద్దండీ అని చెప్పారు. ఇవాళ నన్ను జైల్లో పెట్టారు… అంతటితో అది అయిపోయింది… మనది ఒక రాజకీయ పార్టీ… ప్రజాసంక్షేమమే మన లక్ష్యం కాబట్టి ప్రజాసమస్యలపై మన పోరాటం కొనసాగాలి… మన మార్గమెప్పుడూ ప్రజలకు చేరువగానే ఉండాలి, ప్రజలతోనే సాగాలి అని సూచించారు. ప్రజలకు మేలు జరగడం కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పారు.