జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటు అంశంపై వీరిద్దరు చర్చించారు. వీరు దాదాపు 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు ఇటీవల పవన్ కల్యాణ్‌ను కలిసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరిన విషయం తెలిసిందే. జనసేన 30 స్థానాల్లో ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో పోటీ చేయడానికి సిద్ధమైంది. జనసేన పోటీ చేయకుండా బేషరతుగా మద్దతివ్వాలని బీజేపీ కోరుతోంది. ఈ అంశం అమిత్ షాతో భేటీ సందర్భంగా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. జనసేన ఏ విధమైన మద్దతు ఇస్తుందనేది త్వరలో తేలిపోనుంది.