టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా లేదా. వారాహి యాత్రలో తాను సీఎం అవుతానని..అందుకు మద్దతుగా నిలవాలని కోరటంతో ఈ పొత్తులపైన అనేక సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఎన్నికల పొత్తుల పైన పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడనివ్వకూడదనేదే తన ఉద్దేశం అని చెబుతూనే కీలక వ్యాఖ్యలు చేసారు. మరింత ఆసక్తి పెంచారు. తెలంగాణలోనూ పోటీ చేస్తామని స్పష్టం చేసిన పవన్..బీజేపీ తో పొత్తుపై నిర్ణయం జరగలేదన్నారు. ఏకాభిప్రాయం కష్టసాధ్యం:పొత్తులపైన జనసేనాని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వారాహి యాత్రలో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన పవన్ కీలక అంశాలను ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలవాలనేది తన అభిప్రాయమని స్పష్టం చేసారు. అది ఏ స్థాయిలో ఎలా అనేది తానొక్కడినే ప్రతిపాదించేది కాదని తేల్చి చెప్పారు. అన్ని పార్టీల నుంచి ఏకాభిప్రాయం రావాలన్నారు. అయితే ఏకాభిప్రాయం కుదరడం కొంత కష్టసాధ్యమైన విషయమని కీలక వ్యాఖ్యలు చేసారు ఎన్నికలు దగ్గరపడ్డాక పొత్తులపై మరింత స్పష్టత వస్తుందని చెప్పటం ద్వారా మరింత ఆసక్తిని పెంచారు. తన వైపు నుంచి తాను చెప్పానని వెల్లడించారు. తాను ఇప్పటికే మూడు సార్లు చంద్రబాబును కలిసానని గుర్తు చేసారు. ఇక..మూడు నెలల క్రితం వరకు సీఎం పదవి గురించి చెప్పిన అంశానికి భిన్నంగా పవన్ ప్రస్తుత యాత్ర తనకు సీఎంగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో టీడీపీ..జనసేనలో పవన్ వ్యూహం అంతు చిక్కక కొత్త చర్చలు మొదలయ్యాయి. దీని పైన పవన్ క్లారిటీ ఇచ్చారు. అభిమానులు సీఎం..సీఎం అని నినదిస్తుంటే..’నేను సిద్ధం’ అని సంకేతాలు పంపానని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవి ఒకేసారి వస్తుందా.. అంచెలంచెలుగా వస్తుందా అనేది చూడాలని వ్యాఖ్యానించారు. కోట్ల మంది జీవితాలను ముందుకు తీసుకువెళ్లే పదవి అంటే చాలా అనుభవం కావాలన్నారు. దీనికి క్షేత్రస్థాయి పర్యటనలు, సమస్యలపై అవగాహ న తెచ్చుకోవాలని పేర్కొన్నారు. సీఎం సీఎం అని తన వాళ్లు అదేపనిగా అరుస్తుంటే… తన కేడర్ స్టేట్మెంట్ను ఆమోదించానని వెల్లడించారు. సీఎం అని తన వాళ్లు అనుకుంటే సరిపోదని.. ప్రజలు కూడా అనుకోవాలని పవన్ తేల్చి చెప్పారు.