ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలు చెబుతారా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు… తెలంగాణపై గౌరవం అంతకంటే లేదంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవంపై ప్రధాని మోదీ సాక్షిగా రేవంత్ రెడ్డి దాడి చేశారని ఆరోపించారు. ‘అసలు తెలంగాణ సోయిలేనోడు.. సీఎం కావడం మన ఖర్మ.. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు… ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యమంటూ’ విమర్శించారు. అసలు ‘గోల్ మాల్ గుజరాత్ మోడల్’కు.. ‘గోల్డెన్ తెలంగాణ మోడల్’తో పోలికెక్కడిదని ప్రశ్నించారు. ఘనమైన ‘గంగా జెమునా తెహజీబ్ మోడల్’ కన్నా.. మతం పేరిట చిచ్చు పెట్టే ‘గోద్రా అల్లర్ల మోడల్’ నీకు నచ్చిందా..? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నిన్నటి దాకా.. గుజరాత్ మోడల్‌పై.. నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి… ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలు చెప్పడమా… ఇదేం నీతి… ఇదేం రీతి? అని దుయ్యబట్టారు. తెలంగాణ మోడల్ అంటే.. “సమున్నత సంక్షేమ నమూనా”… “సమగ్ర అభివృద్ధికి చిరునామా”,  అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్… యావత్ దేశానికే నచ్చిన మోడల్, బుడిబుడి అడుగుల వయసులో… బుల్లెటు వేగంతో దూసుకెళ్లిన సమగ్ర, సమ్మిళిత, సమీకృత మోడల్… అని పేర్కొన్నారు.