బీఆర్ఎస్ ఈసారి దుబ్బాకను కొడుతుందని… బీజేపీ నేత, ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈసారి ఇంటి బాట పట్టడం ఖాయమని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్‌లో జరిగిన పార్టీ యువజన గర్జనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రఘునందన్ రావు గెలవకముందు ఎన్నో మాటలు చెప్పారని, హామీలు ఇచ్చారని, కానీ వేటినీ నెరవేర్చలేదన్నారు. ఉప ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు ఇప్పుడు కూడా చెబుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల తర్వాత అసైన్డ్ భూములకు పట్టాలు అందజేస్తామని మంత్రి శుభవార్త చెప్పారు. తెలంగాణ ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలని సూచించారు. అప్పుడు కాలిపోయే మోటార్లు, రాత్రి పొలాల వద్దే పడిగాపులు కాసిన సమయం గుర్తు చేసుకోవాలన్నారు. ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నామన్నారు.