బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యారు . ఈరోజు నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. చేవెళ్లలోని ఫరా కాజేజ్ గ్రౌండ్ లో సాయంత్రం 4.30 గంటలకు ప్రచారంలో భాగంగా తొలి సభ నిర్వహించనున్నారు. ఈ సభలో పాల్గొని కేసీఆర్ ప్రసంగించనున్నారు . తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ స్థానాన్ని రెండు సార్లు గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు . చేవెళ్లలో కేసీఆర్ ప్రసంగించే మొదటి సభకు దాదాపు రెండు లక్షల మంది జనాలను రప్పించాలని లక్ష్యంతో బీఆర్ఎస్ ఉంది . చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తున్నారు. మరోవైపు సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలె యాదయ్య, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పారు. కేసీఆర్ ఈ నెల 16న సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. సుల్తాన్ పూర్ శివారులోని సింగూర్ చౌరస్తా వద్ద బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కేటీఆర్, హరీశ్ రావు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు.