ఏపీలో వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ ముందుగా గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో భాగంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు నిత్యం సంచలనం అవుతూనే ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో అత్యధికంగా ఉన్న కాపు నేతలపై పవన్ వైఖరి ఆసక్తికరంగా మారిందిముఖ్యంగా నిన్న కాకినాడ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీకి చెందిన మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై విమర్శలు చేసేందుకు ఇష్టపడలేదు. అంతే కాదు ఆయన్ను ప్రత్యర్ధిగా కాకుండా గతంలో తమతో ఉన్న అనుబంధం గుర్తుచేసేలా పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో పవన్ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవా లేక యథాలాపంగా వచ్చినవా అన్న చర్చ కూడా సాగుతోంది.కాపులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని జిల్లాలో వైసీపీ కాపు నేతలు తోట త్రిమూర్తులుతో పాటు కన్నబాబును పవన్ కళ్యాణ్ సాఫ్ట్ గానే ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడితే కన్నబాబు బాధపడతాడంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాపు నేతల్ని సైతం ఆలోచనలో పడేశాయి. మేమే రాజకీయాల్లోకి తీసుకొచ్చాం, మా దురదృష్టం, తప్పు చేశామంటూ కన్నబాబును ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన పశ్చాత్తాపానికి మాత్రమే పరిమితమయ్యారు.గోదావరి జిల్లాల్లో ఈసారి టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే కన్నబాబు వంటి వారికి కష్టమేనన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కన్నబాబు జనసేనవైపు చూడొచ్చన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ ఆయనపై విమర్శలు చేయకుండా పశ్చాత్తాపంతో సరిపెట్టడంతో ఈ అంచనాలకు ప్రాధాన్యం మరింత పెరిగింది.