కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణకు వచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సోమవారం ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధుల్ని బీజేపీ ఆపేసి, అభివృద్ధిని అడ్డుకుందని ఆరోపించారు. తెలంగాణకు ఆ పార్టీ చేసిన ఒక రూపాయి అభివృద్ధి అయినా చూపించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులే లేరన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలు అసెంబ్లీకి పోటీ చేయం… ఎంపీగా పోటీ చేస్తామంటూ తప్పించుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ పథకాలను కాపీ కొట్టిందని, అలాంటిది ఇక్కడ అభివృద్ధి జరగలేదని ఎలా అంటారని ప్రశ్నించారు. తెలంగాణ పేరు లేకుండా కేంద్రం ఒక అవార్డు ఇవ్వని పరిస్థితి ఉందని, తెలంగాణలో అభివృద్ధి జరగకుంటే ఢిల్లీలో తెలంగాణకు అవార్డులు ఎందుకు ఇచ్చారన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ సంక్షేమాన్ని, అభివృద్ధిని పొగిడిన ప్రధాని మోదీ రాజకీయం కోసం గల్లీలో మాత్రం తిడుతున్నారన్నారు. సాక్షాత్తు మోదీనే పార్లమెంటులో… కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా నీళ్ల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి అడుగుతారని చెప్పారన్నారు.