హైదరాబాద్‌లో పెట్టాలనుకున్న ఫాక్స్‌కాన్ సంస్థను కర్ణాటకలో పెట్టాలని కాంగ్రెస్ నేత, అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లేఖ రాశారన్న మంత్రి కేటీఆర్ ఆరోపణలపై తెలంగాణ కాంగ్రెస్ స్పందించింది. ఈ మేరకు శనివారం పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ మాట్లాడుతూ… అబద్దపు ప్రచారం చేయడంలో కేటీఆర్ నెంబర్ వన్ అన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఓ కంపెనీకి లేఖ రాశారని కేటీఆర్ తప్పుడు మాటలు చెబుతున్నాడన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే కేటీఆర్ ఇలాంటి మాటలు చెబుతున్నారన్నారు. తమ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం సరికాదన్నారు. తమ వార్ రూమ్ నుంచి డీకే శివకుమార్‌తో తాము మాట్లాడామని, ఆయన లెటర్ హెడ్‌ని ట్యాంపర్ చేశారని చెప్పారని అన్నారు. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదయినట్లు చెప్పారు. కేటీఆర్ గ్రామస్థాయి, బూతుస్థాయి నాయకుడి లాగా మాట్లాడారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎలా బద్నాం చేయాలా? అని కేటీఆర్ కంకణం కట్టుకున్నారన్నారు. ఫేక్ న్యూస్, మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఓయులో బస్సు పెట్టి… కర్ణాటక రాష్ట్రానికి రావాలని సవాల్ విసిరితే కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు స్పందించలేదన్నారు.