వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక ముందడుగు వేసింది. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు హస్తం పార్టీ శుక్రవారం ప్రకటన చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు లేదా ఇన్‌చార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్‌పీ నేతలు, రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ఇన్‌చార్జ్‌లుగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు ఈ స్ర్కీనింగ్ కమిటీల్లో ఎక్స్-అఫిషియల్ సభ్యులుగా ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.

క్లస్టర్ 1లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరిలు ఉన్నాయి. ఈ క్లస్టర్ స్క్రీనింగ్ కమిటీకి హరీష్ చౌదరి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా విశ్వజీత్ కదమ్, జిగ్నేష్ మేవానీ సభ్యులుగా ఉన్నారు. క్లస్టర్ 2లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్ – నికోబార్ దీవులు ఉన్నాయి. ఈ స్క్రీనింగ్ కమిటీకి మధుసూదన్ మిస్త్రీ చైర్మన్‌గా సూరజ్ హెగ్డే, షఫీ పరంబిల్ సభ్యులుగా ఉన్నారు. ఇక గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, డామన్ – డయ్యూ, దాద్రా -నగర్ హవేలీ మూడవ క్లస్టర్‌లో ఉన్నాయి. రజనీ పాటిల్ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా కృష్ణ అల్లవూరు, పర్గత్ సింగ్ సభ్యులుగా ఉన్నారు.