తెలంగాణలో త్వరలో కులగణన చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా… ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని, వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని సూచించారు. స్కూల్ భవనాల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లింపులు చేయాలన్నారు.