ఏపీకి సంబంధించి ఆదివారం రాత్రి బీజేపీ ప్రకటించిన ఆరుగురు లోక్సభ అభ్యర్థుల జాబితాలో నరసాపురం సీటు నుంచి తన పేరు లేకపోవడంపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. నరసాపురం సీటు నుంచి తనకు అవకాశం దక్కకుండా సీఎం జగన్ అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారని, రఘురామకృష్ణరాజుకు బీజేపీ నుంచి టికెట్ రానివ్వరని ముందే కొందరు చెప్పారని ఆయన ప్రస్తావించారు. బీజేపీ తరపున సీటు దక్కకపోయినా సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని రఘురామకృష్ణరాజు తెలిపారు. తాను రాజకీయాల్లోనే ఉంటానని, జగన్కు తగిన గుణపాఠం చెబుతానని మండిపడ్డారు. సీఎం జగన్ అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై మొదటి నుంచి దండెత్తిన తనకు అటు బీజేపీ, ఇతర పార్టీల నుంచి అవకాశం లేకుండా చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.