టీడీపీ అధినేత చంద్రబాబు నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో రా కదలి రా సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. సామాజిక న్యాయం చేస్తానని ఈ ముఖ్యమంత్రి గొప్పలు చెబుతున్నారు… జీవో నెం.3 రద్దు చేయడం సామాజిక న్యాయమా? అని చంద్రబాబు నిలదీశారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికులకే లభించాలని భావించామని, తాను గతంలో ఇచ్చిన జీవో నెం.3ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాగానే జీవో నెం.3ని పునరుద్ధరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గిరిజనుల పిల్లలు చదువుకోవడం జగన్ కు ఇష్టంలేదని, ఈ కారణంతోనే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం రద్దు చేశారని విమర్శించారు. ప్రపంచంలో ఏ మూలన చదువుకుంటున్నా గిరిజనులకు ఉపకారవేతనం లభించేదని, కానీ దాన్ని రద్దు చేశారని అన్నారు. జగన్ గిరిజనుల సహజ సంపదను కూడా దోచుకుంటున్నాడని ఆరోపించారు.