తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె హనుమాన్ ఆలయాన్ని పరిశుభ్రం చేశారు. అయోధ్యలో శ్రీరామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను శుభ్రం చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జనవరి 22 నాటికి దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను శుభ్రం చేయాలని, స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని అన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ప్రాంగణాన్ని శుభ్రం చేసి లక్ష్మణ సమేత సీతారాములను దర్శించుకున్నారు. నవగ్రహ ప్రదక్షిణ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను గవర్నర్ తమిళిసై తన ఎక్స్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు.