ఏపీలో అధికార వైసీపీ దొంగ ఓట్లు నమోదు చేయిస్తోందని, అర్హులైన వారి ఓట్లను తొలగిస్తున్నారని టీడీపీ నేతలు కొన్నాళ్లుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సీఈసీ రాజీవ్ కుమార్ ను కలిశారు. చంద్రబాబు వెంట టీడీపీ ఎంపీలు, పలువురు నేతలు ఉన్నారు. ఓటర్ల జాబితాలో తాము గుర్తించిన అవకతవకలను చంద్రబాబు సీఈసీ రాజీవ్ కుమార్ కు వివరించారు. ఓటరు జాబితాల అక్రమాలపై సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రధానంగా మూడు అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివరాలు అందజేశారు. దొంగ ఓట్లు, ఒకే ఇంటి నెంబరుపై వందల సంఖ్యలో ఓట్లు, సున్నా డోర్ నెంబరు ఓట్ల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. కాగా, వైసీపీ నేతలు కూడా ఈ సాయంత్రం సీఈసీని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరినట్టు తెలుస్తోంది.