దేశంలో లోక్ సభ ఎన్నికలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం-ఒకే ఎన్నిక కార్యాచరణకు సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కమిటీలో సభ్యులను నియమించింది. 8 మంది సభ్యులతో ఈ కమిటీకి రూపకల్పన చేసింది. ఈ కమిటీకి చైర్మన్ గా రామ్ నాథ్ కోవింద్ వ్యవహరిస్తారు. అమిత్ షా, అధిర్ రంజన్, గులాంనబీ ఆజాద్, ఎన్ కే సింగ్, హరీశ్ సాల్వే, సుభాష్, సంజయ్ కొఠారీ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక సాధ్యాసాధ్యాలు, విధి విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. కాగా, సెప్టెంబరు 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన కేంద్రం… ఈ సమావేశాల్లోనే ఒకే దేశం-ఒకే ఎన్నికపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది.