బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమయింది. సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, రాజ్యసభ, లోక్ సభల్లో పార్టీ ఫ్లోర్ లీడర్లు కేశవరావు, నామా నాగేశ్వరరావులతో పాటు రాజ్యసభ సభ్యులు, లోక్ సభ సభ్యులు హాజరయ్యారు. ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. కేసీఆర్ కు తుంటి ఎముక ఆపరేషన్ జరిగిన తర్వాత ఆయన పాల్గొన్న తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం.