కేసీఆర్ కూతురు కవిత మెదక్ ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు రావడంతో జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు అలర్ట్ అవుతున్నారని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. నిన్న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అంశంపై రఘునందన్ రావు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో బావబామ్మర్దులకు పడటం లేదని అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రోద్బలం లేకుండా నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు.

కర్మ సిద్ధాంతం బీఆర్ఎస్‌కు అనుభవంలోకి వస్తోంది

కర్మ సిద్ధాంతం ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు అనుభవంలోకి వస్తోందని రఘునందన్ రావు చురక అంటించారు. ఎవరు ఏం చేస్తే అదే వారికి తిరిగి వస్తుందనడానికి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడమే నిదర్శనమన్నారు. భూమి గుండ్రంగా ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. మనం చేసింది తిరిగి వస్తుందన్నారు. మెజార్టీ ఉన్నప్పటికీ అప్పుడు బీఆర్ఎస్… ఇప్పుడు కాంగ్రెస్… ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పార్టీలను చీల్చడానికి… ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి బీఆర్ఎస్‌కు ఏడేళ్లు పడితే కాంగ్రెస్ పార్టీకి ఏడు నెలలు కూడా పట్టలేదని విమర్శించారు.