పెన్షన్ల పెంపు పేరుతో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల్ని దగా చేయడం తప్ప జగన్ రెడ్డి సాధించిందేమీ లేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి పెన్షన్లు రూ.3 వేలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏటా రూ.250 చొప్పున పెంపు అంటూ హామీపై మడమ తిప్పారని ఆరోపించారు. ఆ మాట ప్రకారం పెంచినా 2022 నాటికే రూ.3 వేల పెన్షన్ ఇవ్వాలని అన్నారు. 

ఇప్పుడు ఎన్నికలకు మరో మూడు నెలల కాలం ఉందనగా రూ.3 వేలు చేస్తున్నామంటూ, కేబినెట్లో ఆమోదిస్తున్నామంటూ హడావుడి చేయడం సిగ్గుచేటు అని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఇది ఇంకొక మోసం తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. రూ.3 వేల హామీపై మడమ తిప్పి ఒక్కో పెన్షన్ దారుడికి జగన్ రెడ్డి దాదాపు రూ.32 వేల వరకు ఎగనామం పెట్టాడని వివరించారు. ఇదేనా పేదలపై చిత్తశుద్ధి? ఇదేనా పెన్షన్ దారులపై శ్రద్ధ? అంటూ నిలదీశారు.