అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి మరో కానుక అందనుంది. ప్రాణప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకుని సిద్ధం చేసిన భారీ లడ్డూ అయోధ్యకు బయలుదేరింది. రాముడి గుడికి భూమి పూజ జరిగిన నాటి నుంచి ప్రాణప్రతిష్ఠ ముహుర్తం రోజు వరకు మొత్తం 1,265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగా సికింద్రాబాద్ కు చెందిన శ్రీరామ్ క్యాటరర్స్ 1,265 కిలోల భారీ లడ్డూను తయారుచేశారు.

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నుంచి ముందుగా అనుమతి పొంది, స్వామి వారికి నైవేద్యంగా సమర్పించేందుకు ఈ భారీ లడ్డూను సిద్ధం చేసినట్లు శ్రీరామ్ క్యాటరర్స్ యజమాని నాగభూషణం రెడ్డి తెలిపారు. ఈ భారీ లడ్డూతో పాటు మరో ఐదు చిన్న లడ్డూలను కూడా తయారు చేశామని వివరించారు. పికెట్ లోని ఆయన నివాసం నుంచి ఈ ప్రసాదాలను అయోధ్యకు చేర్చేందుకు బుధవారం ఉదయం శోభాయాత్రను ప్రారంభించారు. రోడ్డు మార్గం ద్వారా ఈ నెల 21 నాటికి ఇవి అయోధ్యకు చేరుకుంటాయని నాగభూషణం రెడ్డి పేర్కొన్నారు.