ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక ధరణి తప్పుల తడకని ఆయన ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే అర్థమవుతోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె ఎక్స్ వేదికగా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. స్వయానా ముఖ్యమంత్రికి గుంట భూమి ఎక్కువగా వచ్చిందంటే ఇక సామాన్యుల సంగతి దేవుడెరుగు అన్నారు. ఉన్నోళ్లకు లేనట్టుగా, లేనోళ్లకు ఉన్నట్టుగా, సర్వే నెంబర్ల వరకు మార్చి చూపించే మాయాజాలమే ధరణి అన్నారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చినట్లు రాష్ట్రంలో ఏ ఊరు చూసినా ధరణి గోసలే కనిపిస్తున్నాయన్నారు.తహసీల్దార్ దగ్గర నుంచి కోర్టుల దాకా అందరికీ ధరణి బాధలే ఉన్నాయన్నారు. రైతుల భూములను గుంజుకొని, కోర్టుల చుట్టూ తిప్పుతూ ధరణే దైర్యం అని చెప్పడానికి దొరకు ఆయన బందిపోట్లకు సిగ్గుండాలన్నారు. భూవివాదాల కోసం కాదు.. ముమ్మాటికి దొర భూదోపిడీ కోసమే తెచ్చుకున్న పథకం ధరణి అని పేర్కొన్నారు. బందిపోట్ల ఆస్తులను పెంచడానికి అమలు చేసిన పథకం ఇది అని ఆరోపించారు. ధరణి తిప్పలు తప్పాలంటే దొర నియంత పాలనను బొంద పెట్టుడు ఒక్కటే మార్గం అన్నారు. ఈ ఎన్నికల్ల కారుకు కర్రు కాల్చి వాత పెట్టుడు ఒక్కటే పరిష్కారమన్నారు.