మద్యం కేసులో వేరేవారిని అరెస్ట్ చేశారు కానీ… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయలేదని.. కేసీఆర్ కుటుంబం బరితెగించిందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అన్నారు. గురువారం వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ నియోజకవర్గం అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి తరఫున ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అందరికీ చుక్కలు చూపించే వరంగల్ వాసులను కూడా కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. వరంగల్‌వాసులు కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను గద్దె దించాల్సిందే అన్నారు.

ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వని స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితికి వచ్చిందని, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు… కేసీఆర్‌కు డబ్బే ముఖ్యమని మండిపడ్డారు. భూ, మైనింగ్ మాఫియాను కేసీఆర్ ప్రోత్సహించారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో అవినీతి చేశారన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌లో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.