కేంద్రమంత్రి కైలాశ్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఉండాలనుకుంటున్న వారు తప్పకుండా ‘భారత్ మాతాకీ జై’ అనాల్సిందేనని తేల్చి చెప్పారు. వ్యవసాయశాఖ సహాయమంత్రి అయిన ఆయన బీజేపీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ రైతు కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ప్రజాప్రతినిధులు వాడుతున్న భాషను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారికి గుణపాఠం చెప్పాల్సిందేనని, రాష్ట్రం (తెలంగాణ)లో జాతీయవాద ఆలోచనలతో కూడిన ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. ఇండియాలో ఉంటూ పాకిస్థాన్ జిందాబాద్ అంటారా? అని ప్రశ్నించారు. ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ అన్న వారికే దేశంలో చోటు ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘ఎవరైతే ‘భారత్ మాతా కీ జై’ అనరో, ఎవరికైతే హిందూస్థాన్ మీద, భారత్ మీద విశ్వాసం లేదో, ఎవరైతే ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటారో వారు పాకిస్థాన్ వెళ్లిపోవాల్సిందే. అలాంటి వారికి ఇక్కడ స్థానం లేదు’’ అని మంత్రి తేల్చి చెప్పారు.