ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు. మంగళవారం కవితను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఆమెకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది. దీంతో ఆమెను మధ్యాహ్నం జైలు వ్యాన్‌లో తీహార్ జైలుకు తరలించారు. ఆమె ఏప్రిల్ 9వ తేదీ వరకు జైల్లో ఉండనున్నారు. ఈ క్రమంలోనే ఈడీ అధికారులకు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈడీ అధికారులను కవిత మెడికల్ రిపోర్టులను లాయర్లకు అందించాలని కోర్టు ఆదేశించింది. ఆమెకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని తెలిపింది. అలాగే పరుపులు, బెడ్ షీట్లు, పుస్తకాలు, మందులు, అనుమతించాలని స్పష్టం చేసింది. కొన్ని పేపర్లు, పెన్నులను కూడా ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. అయితే ఈ కేసులో కవిత మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు టైం కావాలని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 1వ తేదీన ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది.