ఏపీలో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా చేతులు కలిపిన టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహన కుదిరింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశంలో ఈ మధ్యాహ్నం నుంచి దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశం ముగిసింది. 

టీడీపీ తరఫున చంద్రబాబు, జనసేన నుంచి పవన్, బీజేపీ తరఫున గజేంద్ర సింగ్ షెకావత్, బైజయంత్ పండా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు, ఎవరెక్కడ పోటీ చేయాలన్న అంశంపై క్షుణ్ణంగా చర్చించారు. సుదీర్ఘ సమావేశం అనంతరం సీట్ల పంపకం వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. 

పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా… బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక, టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో బరిలో దిగనుంది. 

ఇటీవల జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించినప్పటికీ, బీజేపీ కూడా పొత్తులోకి వచ్చిన నేపథ్యంలో ఆ ప్రకటనకు నేడు సవరణ చేసినట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో, మూడు పార్టీలు అభ్యర్థుల జాబితాలపై దృష్టి సారించనున్నాయి.