రాజకీయాల్లో ఒకరిపై ఒకరు మాటలతో విమర్చించుకోవటం సహజం కానీ ఈ మధ్య బౌతికంగా రాళ్లతో కూడా దాడులు చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై గులకరాయితో దాడి జరిగటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. జగన్ పై టీడీపీ హత్యాయత్నం చేయించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తూ మరో కోడికత్తి డ్రామాకు తెరతీశారని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు ఆదివారం గాజువాకలో టీడీపీ అధినేత చంద్రబాబు, తెనాలిలో జనసేనాని పవన్ కల్యాణ్ లపై కూడా రాళ్ల దాడులు జరిగాయి. చంద్రబాబు మాట్లాడుతున్న టైంలో ఆయన పైకి రాళ్లు విసిరినప్పటికీ అవి ఆయన వరకు చేరక ప్రమాదం తప్పింది . ఈ దాడిని గుర్తించిన చంద్రబాబు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాడికి యత్నించిన వారిని పట్టుకునేందుకు యత్నించగా వాళ్లు పారిపోయారు. ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అందరూ చూస్తుండగానే తనపై రాళ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. రాళ్ళ దాడులు చేస్తున్న , చేయిస్తున్న ఎవ్వరినీ ప్రజలు వదిలి పెట్టరని, తరిమితరిమి కొడతారని హెచ్చరించారు. వైసీపీ బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఇక్కడకు వచ్చిందని చంద్రబాబు అన్నారు. మరోవైపు, ఇప్పటి వరకు చంద్రబాబుపైనే ఎక్కువ రాళ్లదాడులు జరిగాయి. గత ఏడాది ఆగస్ట్ లో తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో రాళ్లదాడి జరిగింది. ఆ దాడి సందర్భంగా అంగళ్లులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 2021లో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఇలాగే దుండగులు రాళ్లు విసిరారు . గత సంవత్సరం ఏప్రిల్ లో చంద్రబాబును మంత్రి ఆదిమూలపు సురేశ్ తన వర్గీయులతో కలిసి అడ్డుకునేందుకు యత్నించిన క్రమంలో కూడా కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. 2022లో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా నందిగామలో చంద్రబాబు రోడ్ షో చేపట్టారు. అప్పుడు కూడా ఒక దుండగుడు చంద్రబాబుపై రాయి విసిరాడు. అయితే అది చంద్రబాబుకు మిస్ అయి… ఆయన భద్రతాధికారికి తగిలి ఆయన తీవ్రంగా గాయపడ్డారు.