తెలంగాణ వారికి పాలన చేతకాదని కొంతమంది ఎగతాళి చేశారని, కానీ మనం కొత్తగా నిర్మిస్తోన్న ఆఫీసులే వారికి సమాధానమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కొన్ని రాష్ట్రాల్లో సచివాలయాలే సరిగ్గా లేవన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. నాణ్యమైన విద్యుత్ ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఒకప్పుడు కాలువలు ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాలన్నారు. సమైక్య రాష్ట్రంలో మంజీరా నది దుమ్ము కొట్టుకు పోయిందన్నారు.

తక్కువ కాలంలోనే తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. పరిశుభ్రమైన తాగునీరు అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దివ్యాంగుల పెన్షన్ రూ.4వేలకు పెంచుకున్నామని, రానున్న రోజుల్లో మరింత ఆర్థిక ప్రగతితో మరింత పెంచుకుందామన్నారు. తెలంగాణ రాకముందు 24 లక్షల పెన్షన్లు వచ్చేవని, ఇప్పుడు రెండింతలు అయినట్లు చెప్పారు. తెలంగాణ ఆర్థిక ప్రగతి సాధించింది కాబట్టే సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.