తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి పాస్ వర్డ్ మార్చేశారు. కంపెనీ నియమనిబంధనలు ఉల్లంఘించారంటూ ట్విట్టర్ కంపెనీ నుంచి గవర్నర్ కు ఓ మెయిల్ వచ్చింది. దీంతో గవర్నర్ తన ట్విట్టర్ అకౌంట్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా.. పాస్ వర్డ్ తప్పంటూ జవాబు వచ్చింది.

తన ట్విట్టర్ హ్యాండిల్ పోస్టులను పరిశీలించిన గవర్నర్.. అందులో తనకు సంబంధంలేని పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. ఈ విషయంపై రాజ్ భవన్ సిబ్బందిని గవర్నర్ ఆరా తీసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో రాజ్ భవన్ అసిస్టెంట్ కంప్ట్రోలర్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాఫ్తు చేపట్టినట్లు సమాచారం.