జీ-20 సదస్సు ఆహ్వాన పత్రికలపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడం, ఆ తర్వాత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ రెండు అంశాలపై ఆచితూచి స్పందించాలని కేంద్రమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారని తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో ‘భారత్’ అనే పదాన్ని ప్రధాని మోదీ ప్రధానంగా ప్రస్తావించారని సమాచారం. భారత్ అనే అంశంపై ఎక్కువగా స్పందించవద్దని, సంబంధిత వ్యక్తులు మాత్రమే మాట్లాడాలని కేంద్రమంత్రులకు సూచించారని తెలుస్తోంది. అదే సమయంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టాలని ఆయన పరోక్షంగా సూచించారని సమాచారం. చరిత్ర లోతుల్లోకి వెళ్లకుండా, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలను ప్రజలకు చెప్పాలని, సమకాలీన పరిస్థితులపై మాట్లాడాలని, అలాగే వివాదాస్పద వ్యాఖ్యలకు చోటు ఇవ్వవద్దని, బలమైన స్పందన ఉండాలని సూచించారని తెలుస్తోంది