జనసేనాని పవన్ కల్యాణ్ గాజువాక సభలో తనదైన శైలిలో ప్రసంగించారు. నేను పని చేసుకుంటూ వెళుతున్నాను, మీరు గెలిపిస్తే ముఖ్యమంత్రిని అవుతాను అంటూ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. పదేళ్లుగా ప్రజల మధ్యలో ఉన్నాను, ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని స్పష్టం చేశారు. 

జగన్ మరోసారి సీఎంగా వద్దు అని పునరుద్ఘాటించారు. “జగన్ ఒక దుర్మార్గుడు… ఓట్లు చీలకూడదు అనడానికి కారణం  అలాంటివాడు మరోసారి సీఎంగా రాకూడదనే. ఇన్ని వేల కోట్లు ఏం చేసుకుంటావు జగన్? ఏ కష్టం చేయకుండా ప్రజల ఆస్తులు దోచుకుంటున్నావు. దేవుడు అని భుజాన ఎక్కించుకుని జగన్ ను గెలిపిస్తే, దెయ్యమై ఊరి మీద పడి దోచుకుంటున్నాడు” అంటూ పవన్ నిప్పులు చెరిగారు. 

కోటి మంది ప్రజలు వచ్చి నిన్ను చుట్టుముడితే ఎక్కడికి పోతావ్ జగన్? అంటూ నిలదీశారు. ఎంతమంది పోలీసులను అడ్డుపెట్టుకుంటావ్? ప్రజలు నిన్ను ముట్టడించే రోజు వస్తుంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
గాజువాక సభలో పవన్ ప్రసంగం వివరాలు…

  • వైసీపీ ఎంపీలకు పార్లమెంటులో ప్లకార్డు పట్టుకునే దమ్ముందా?  
  • విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అక్రమ నిర్మాణాల్లో ఎవరూ పెట్టుబడులు పెట్టకండి… ఫ్లాట్స్ కొనకండి. జనసేన ప్రభుత్వం రాగానే వాటిని కూల్చేస్తాం. 
  • ఎంవీవీ… గుర్గావ్ లో నీకు చెందిన 36 అంతస్తుల భవనాన్ని కూల్చివేసిన విషయం గుర్తుంచుకో.  
  • ఎంపీ ఎంవీవీ 4 అంతస్తులకు అనుమతి తీసుకుని 26 అంతస్తులు కడుతున్నాడు. 
  • ఆంధ్రా వర్సిటీ వీసీపై ఫిర్యాదులు వచ్చాయి. సిబ్బంది నుంచి అతడు శ్రమదోపిడీ చేస్తున్నాడు. ఈ వీసీ వైసీపీ మద్దతుదారుడు.  
  • ఆంధ్రా వర్సిటీ 600 ఎకరాల స్థలంలో ఉంది. విశాఖను కాలుష్య నుంచి రక్షించే ఊపిరితిత్తుల వంటి చెట్లను ఈ వీసీ కొట్టించేస్తున్నాడు.