జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి తాను ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గంలో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పవన్ మాట్లాడుతూ, వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలన్న ఏకైక లక్ష్యంతోనే పొత్తు కుదుర్చుకున్నామని వెల్లడించారు. మా కూటమి మధ్య ఎలాంటి విభేదాలకు తావులేదని , అన్నీ అనుకూల రీతిలోనే పొత్తు కుదిరిందని పవన్ అన్నారు. “పొత్తు కారణంగా మా పార్టీ నేతలు కూడా బాగా నలిగిపోయారని, చాలామంది ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నామని బాధపడ్డారని ఆయన అన్నారు . ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్రం కోసం మనసుతో స్పందించానని , బీజేపీ జాతీయ స్థాయి పెద్దలు తమకు ఎక్కువ సంఖ్యలో ఎంపీ స్థానాలు కావాలని కోరితే అంగీకరించానన్నారు . జనసేన రెండు ఎంపీ స్థానాలకు పరిమితమైనా, అందరినీ కలుపుకుని వెళ్లాలన్న ఉద్దేశంతో బీజేపీ పెద్దల అభిమతాన్ని కాదనుకుండా ముందుకు వెళ్లామని జనసేనాని తెలిపారు. జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేదానిపై తాను లెక్కలు వేసుకోలేదని, ఏపీ భవిష్యత్ బాగుండాలి, వైసీపీ కీచక పాలన నుంచి ఏపీ ప్రజలను బయటపడేయాలన్న ఉద్దేశంతోనే ఎలాంటి షరతులు లేకుండా పొత్తు కుదుర్చుకున్నామని పవన్ కళ్యాణ్ వివరించారు.రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. పొత్తు విషయంలో మా మూడు పార్టీల ప్రజలు 70 నుంచి 80 శాతం వరకు సానుకూలంగా స్పందించారన్నారు . అందువల్ల పొత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని , 2014లో పది మందిని ఎన్నికల్లో నిలిపే సత్తా ఉన్నప్పటికీ, విభజన అనంతరం కొత్త రాష్ట్రంలో సమర్థ పాలన ఉండాలని ఆనాడు కూటమికి మద్దతు ఇచ్చామన్నారు . ఇప్పుడు 2024లో తమ బలం ఇంకా పెరిగిందని తెలిసినప్పటికీ, ఎలాంటి గందరగోళం లేకుండా ముందుడుగు వేయాలన్న ఉద్దేశంతో, వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో పొత్తులకు చొరవ చూపించాం” అని పవన్ కళ్యాణ్ వివరించారు.