రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్ని సీట్లు తీసుకోవాలో జనసేనాని పవన్ కళ్యాణ్ కు కొందరు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసని… అది తెలియకుండానే ఇక్కడ వరకు వచ్చానా? అని ప్రశ్నించారు. 

కొందరు 50 తీసుకోండి, 60 తీసుకోండి అంటున్నారని… పొత్తును ఇబ్బంది పెట్టేలా కొందరు మాట్లాడుతున్నారని పవన్ అన్నారు. ఇది మంచిది కాదని హితవు పలికారు. సీట్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మనం మూడో వంతు సీట్లను తీసుకోబోతున్నామని చెప్పారు. సీట్ల విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి ఉంటుందని, అలాగే తనపై కూడా ఒత్తిడి ఉందని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో తాను రెండు సీట్లను ప్రకటిస్తున్నానని… రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని అన్నారు