టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన అయ్యన్నను అప్పటికే అక్కడున్న కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై నిప్పులు చెరిగారు. అరెస్టులతో తమ గొంతులను నొక్కలేవు జగన్ అని అన్నారు. నీ అణచివేతే తమ తిరుగుబాటు అని చెప్పారు. అయ్యన్న పాత్రుడి అరెస్ట్ జగన్ సైకో పాలనకు పరాకాష్ఠ అని దుయ్యబట్టారు.  అయ్యన్న మాట్లాడిన మాటలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయినట్టైతే… సీఎంగా ఉన్న జగన్, ఇతర వైసీపీ నేతల వ్యాఖ్యలను ఏమనాలని ప్రశ్నించారు. వైసీపీ మంత్రులు, నేతల బూతులు పోలీసులకు ప్రవచనాల్లా వినిపిస్తున్నాయా? అని మండిపడ్డారు. రాజారెడ్డి రాజ్యాంగంలో వైసీపీ నేతలకు ప్రత్యేక హక్కులు కల్పించారా? అని ప్రశ్నించారు. ప్రజల గళాన్ని వినిపిస్తున్న అయ్యన్నపాత్రుడు అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.