ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ నేడు హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. ప్రధానంగా పొత్తుకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. పొత్తు ధర్మం ప్రకారం ఏపీలో టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించారు. 

ఇప్పటికే టీడీపీ, జనసేన పలువురు అభ్యర్థులతో జాబితాలు ప్రకటించాయి. మిగిలిన అభ్యర్థులు, వారి స్థానాలు తదితర అంశాలపై నేటి సమావేశంలో చంద్రబాబు, పవన్ చర్చించారు. వీలైనంత త్వరగా మిగిలిన అభ్యర్థులను ప్రకటించి, ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని ఇరువురు నిర్ణయించారు.