నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మర్రి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి నుంచి తన నివాసంలో సోదాలు జరుగుతున్నాయని చెప్పారు. తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఐటీ అధికారులు బూతులు తిట్టడమే కాకుండా, చేయి కూడా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సోదాలు చేయడానికి వచ్చి తన ఉద్యోగులపై చేయిచేసుకోవడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యేలు వ్యాపారాలు చేయకూడదా? అని ప్రశ్నించారు. తన సహనాన్ని ఐటీ అధికారులు పరీక్షించవద్దని అన్నారు. తాను ఇప్పటికే రూ. 150 కోట్ల ఆదాయపన్నును కట్టానని… గతంలో తనకు ఐటీ శాఖ నుంచి అవార్డు కూడా వచ్చిందని చెప్పారు. తమ సెల్ ఫోన్లను కూడా ఐటీ అధికారులు తీసుకున్నారని అన్నారు.