చంద్రబాబుతో రాజమండ్రి జైలులో ములాఖత్ అనంతరం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తాను ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్లు కోరలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రం హస్తం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తాను ఏ అంశంపైనా మాట్లాడనని అన్నారు. రాజమండ్రి సెంట్రలు జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు భద్రత పట్ల లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. “రాజమండ్రి జైల్లో ఇవాళ చంద్రబాబును కలిశాం. ఆయన ధైర్యంగా ఉన్నారు. ఆయన ఆశావహ దృక్పథం కలిగిన వ్యక్తి. పరిస్థితుల పట్ల ఆయన భయపడడంలేదు. అయితే, జైల్లో ఆయన భద్రతపై మాకు ఆందోళనగా ఉంది. రాజమండ్రి జైలుపై దాడి చేస్తామని కొందరు లేఖ రాశారు. రాజమండ్రి జైలుపై కొందరు డ్రోన్ ఎగరేశారు. రాజమండ్రి జైలులో కొందరు నక్సల్స్ ఖైదీలుగా ఉన్నారు. గంజాయి అమ్మేవాళ్లు కూడా రాజమండ్రి జైలులో ఖైదీలుగా ఉన్నారు” అని వివరించారు.