చేనేత కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేఖ రాశారు. నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆ లేఖలో ఆరోపించారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ ఆదుకోరా? కార్మికులు రోడ్డునపడ్డా కనికరించరా? అని ప్రశ్నించారు. పదేళ్ల తర్వాత సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభం చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. నేతన్నల బతుకులు ఆగమయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయన్నారు. నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్లు ఆపేసిందని ధ్వజమెత్తారు.

గతంలో మాదిరే నేతన్నలకు చేతినిండా అర్డర్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల కోడ్ వల్ల నిలిపివేసిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. చేనేతమిత్ర వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు.